జనం న్యూస్ : కడప: దువ్వూరు మండలం గుడిపాడు నాయి బ్రాహ్మణ కాలనీకి చెందిన వెంకటగిరి శ్రీనివాసులు తీవ్ర అనారోగ్యంతో కడప రిమ్స్ ఆసుపత్రిలోని మెడికల్ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి శనివారం సాయంత్రం రిమ్స్ ఆసుపత్రికి వెళ్లి శ్రీనివాసులను పరామర్శించారు. అనంతరం ఆయన శ్రీనివాసుల తల్లి నారాయణమ్మను కలిసి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే సంబంధిత వైద్యులు డా. తనూజ్ రెడ్డి, డా. సుబ్బారెడ్డితో మాట్లాడి శ్రీనివాసులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని కోరారు. చిన్న వయసులోనే అనారోగ్యానికి గురైన శ్రీనివాసులకు మంచి భవిష్యత్తు ఉందని, తగిన చికిత్స అందించి త్వరగా కోలుకునేలా చర్యలు తీసుకోవాలని వైద్యులను రెడ్యం వెంకటసుబ్బారెడ్డి అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో గుడిపాడు మాజీ ఎంపీటీసీ ఆలవలపాడు గంగయ్యతో పాటు పలువురు బంధువులు పాల్గొన్నారు.