జనం న్యూస్ జనవరి 20 పిట్లం : చిన్న కోడపగల్ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తూ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఉపాధ్యాయురాలు పి.కాశమని కుటుంబానికి పి.ఆర్.టి.యు ఉపాధ్యాయ సంఘం ₹1,00,000/- (లక్ష రూపాయలు) ఆర్థిక సహాయం అందజేసింది.కాశమని పి.ఆర్.టి.యు సంఘంలో క్రియాశీలక సభ్యురాలిగా ఉండటంతో, సంఘం నిబంధనల ప్రకారం ఈ ఆర్థిక సహాయాన్ని పి.ఆర్.టి.యు మాజీ రాష్ట్ర అధ్యక్షులు గుండు లక్ష్మణ్,పి.ఆర్.టి.యు జిల్లా అధ్యక్షులు కుశాల్, ప్రధాన కార్యదర్శి పుట్ట శ్రీనివాస్ రెడ్డి, మండల శాఖ అధ్యక్షులు పి.బన్సీలాల్,ప్రధాన కార్యదర్శి సి.నారాయణ చేతుల మీదుగా మృతురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కుశాల్ మాట్లాడుతూ,విధి నిర్వహణలో ఉపాధ్యాయులు ఎదుర్కొనే అనూహ్య పరిస్థితుల్లో పి.ఆర్.టి.యు ఉపాధ్యాయ సంఘం సభ్యులకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బన్సీలాల్,మండల ప్రధాన కార్యదర్శి నారాయణతో పాటు వివిధ మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు,రాష్ట్ర,జిల్లా,మండల స్థాయి బాధ్యులు పాల్గొని మృతురాలి సేవలను స్మరించుకుంటూ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పి.ఆర్.టి. యు ఉపాధ్యాయ సంఘం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఉపాధ్యాయ కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్నాయని ఈ సందర్భంగా పలువురు నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.