జనం న్యూస్ 14.3.2026 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి అన్నం ఆంజనేయులు మెదక్ జిల్లా చేగుంట మండలం దుబ్బాక నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కీలక విప్లవానికి శ్రీకారం చుట్టింది. నేటి నుండి రాష్ట్రవ్యాప్తంగా వాహనాల పర్మనెంట్ రిజిస్ట్రేషన్ విధానం పూర్తిగా ఆన్లైన్ ద్వారానే నిర్వహించనున్నారు. ఇకపై రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయాలకు భౌతిక పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ నూతన విధానం ద్వారా అటు వాహనదారులకు, ఇటు అధికారులకు సమయం ఆదా కావడంతో పాటు, పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. తాత్కాలిక రిజిస్ట్రేషన్ పూర్తయిన ఏడు రోజుల్లోపు సంబంధిత డీలర్లు వాహన యజమాని మరియు ఫైనాన్షియర్ సంతకాలతో కూడిన ఫామ్ 20తో పాటు ఇతర పత్రాలను ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. డిజిటల్ విధానంపై రవాణా శాఖ అధికారులు కఠినమైన నిబంధనలను కూడా జారీ చేశారు. ఆన్లైన్లో సమర్పించిన పత్రాలను పరిశీలించి, కేవలం రెండు పని దినాలలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి. ఒకవేళ ఎవరైనా తప్పుడు సమాచారాన్ని అందించినా లేదా నకిలీ పత్రాలను అప్లోడ్ చేసినా వారిపై కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ హెచ్చరించింది. ఈ మార్పు వల్ల ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ తిరిగే పని తప్పుతుందని, దళారీల బెడద తగ్గుతుందని సామాన్య వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయి డిజిటలైజేషన్ దిశగా తెలంగాణ రవాణా శాఖ తీసుకున్న ఈ నిర్ణయం ఒక మైలురాయిగా నిలవనుంది.